- రోడ్డు భద్రత నియమాలు పాటించి
- సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలి
- బెల్లంపల్లి ఏసిపి ఏ రవి కుమార్

నేటి సాక్షి, మందమర్రి:- వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి, వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో పట్టణ ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ పాఠశాలల వ్యాన్ డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి మంచిర్యాల బృందం వారు పాల్గొని, తమ పాటలతో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ మాట్లాడుతూ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి, వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు దాటేవారు తప్పకుండా ఒక్క క్షణం ఆగి చూసి, రోడ్డు దాటాలని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనాలు నడపాలని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబం మొత్తం పై ప్రభావం చూపుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, సూచించారు. లాంగ్ డ్రైవ్ చేసే డ్రైవర్లు విశ్రాంతి ప్రదేశాలలో వాహనాలు ఆపుకొని, విశ్రాంతి తీసుకుని సమయస్ఫూర్తిగా వాహనాలు నడపాలని సూచించారు. పెద్ద పెద్ద వాహన డ్రైవర్లు వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే పార్కు చేయాలని తెలిపారు. రాత్రి సమయంలో వాహనాలు పార్కు చేసేటప్పుడు పార్కింగ్ లైట్లు తప్పకుండా వేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాలలో రోడ్లపై వాహనాలు నిలపవద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత నియమాలు పాటించి, వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్, ఏ ఎస్సై మజీద్, పోలీస్ సిబ్బంది, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, వాహనదారులు పాల్గొన్నారు.





