- ఫలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృషి
- స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్ గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు
- గవర్నర్ ఆమోదంతో గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- నియోజకవర్గ ప్రజల కోరికను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ ప్రజల చిరకాల కోరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నెరవేరిందని మాజీ ఉప ముఖ్య మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్, శివునిపల్లి, చాగల్ గ్రామాల ప్రజలు అనేక సందర్భాలలో స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయాలని అప్పుడే నియోజకవర్గ కేంద్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారాని తెలిపారు. 2023 ఎన్నికల సమయంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయిస్తానని, నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చాను. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేకసార్లు కలిసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయాలని కోరినట్లు, ఆ కోరిక మేరకే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. సోమవారం గవర్నర్ ఆమోదంతో స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అధికారికంగా అమల్లోకి తీసుకు వస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీని ఘనంగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి కి స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల అభీష్టం మేరకు మరియు నా కోరిక మేరకు స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.





