
నేటి సాక్షి,మెట్ పల్లి (నరేష్ దూలూరి) : సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రేగుంట 13 వ వార్డుకు చెందిన కాపెల్లి రమేష్ (30) మృతి చెందారు. గతంలో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి వచ్చి మూడు సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందారు. మూడు నెలల కిందట ఉపాధి కోసం సౌదీ అరేబియా వలస వెళ్ళిన అతను అక్కడ జుబైల్ లోని ఏసిఐసి సర్వీస్ కంపెనీలో వారం క్రితం పనిలోకి కుదిరారు. సోమవారం ఉదయం జిజాన్ లో పని నిమిత్తం ఏసిఐసి సర్వీస్ కంపెనీకి చెందిన బస్సులో బయలుదేరారు. 26 మంది ఉద్యోగులతో వెళుతున్న బస్సు, ట్రక్కు జిజాన్ అరంకో రిఫైనరీ రోడ్డులో ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ అక్కడికక్కడే మరణించారు.ఈ విషయం కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి రోదనలు మిన్నంటాయి.రమేష్ కు భార్య శ్వేత కూతుర్లు ఇద్దరు నందన (7), శ్రీవల్లి (5) ఉన్నారు. రమేష్ మృతదేహాన్ని త్వరగా తీసుకువచ్చేలా చేయాలని ప్రభుత్వంను కుటుంబ సభ్యులు కోరారు.





