- వసతి గృహాల వద్ద సిసి కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు తప్పనిసరి
- మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :- బాలికల, మహిళల రక్షణ, భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత, లక్ష్యమని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఐపీఎస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి ఆదేశాల మేరకు బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలల ప్రిన్సిపాల్ లు, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు బాలికల, మహిళ వసతి గృహాలకు సంబంధించిన బాధ్యులు, వార్డెన్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో తీసుకోవలసిన భద్రత పరమైన చర్యల గురించి, సీసీ కెమెరాలు ప్రాముఖ్యత గురించి, సెక్యూరిటీ గార్డు ఏర్పాటు గురించి వివరంగా చర్చించి, తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసతి గృహాల యాజమాన్యం తమ హాస్టల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలు 30 రోజుల నిడివి సామర్థ్యం కలిగినవి, రిసెప్షన్, కారిడార్ నలువైపుల పరిసరాలు క్షుణ్ణంగా కనిపించే విధంగా బిగించుకోవాలని సూచించారు. హాస్టల్ పరిసరాలు వెలుతురు కలిగి ఉండాలని, హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా బాలికల ప్రవర్తన, వారి కదలికలను గమనిస్తూ, వారితో ప్రేమగా, మనస్సు విప్పి మాట్లాడి, వారి మానసిక ప్రవర్తనను గమనించి, వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఏదైనా ఇబ్బందికరమైన ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న అదే విధంగా వసతి గృహాల ప్రాంతంలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన, ఇబ్బందులు గురిచేస్తున్నారనే సమాచారం ఉన్న వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువస్తే, తగిన చర్యలు చేపడతామని, పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ సిఐ ఎస్ ప్రమోద్ రావు, షీ టీం ఇంచార్జ్ హైమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





