Sunday, March 15, 2026

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలి

  • సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
  • సెస్, చేనేత జౌళి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలని వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సెస్, చేనేత శాఖ అధికారులతో బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్, సిరిసిల్ల (సెస్)నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను రైతులకు, పవర్ లూమ్ పరిశ్రమకు అందించాలని సెస్ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్ రెగ్యులేటరి కమిషన్ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

చేనేత జౌళి శాఖ

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్ పి వరకు 50% విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని, యారన్ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించినారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జీవో నంబర్ 1, తేదీ: 18.03.2024 ప్రకారము ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కోకు సమర్పించడం లేదో ఆయా శాఖలు మీద చర్యలు తీసుకొనుటకు,చేనేత సహకార సంఘాలకు మరియు పవర్ లూమ్ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిరిసిల్ల సెస్ మరియు చేనేత అంశాలపైన మంత్రికి కేకే మహేందర్ రెడ్డి వినతి పత్రం అందించారు. సమావేశాలలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు , సహకారశాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ , హార్టికల్చర్ డైరెక్టర్, యాస్మిన్ బాషా, సెస్ అధికరాలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News