జర్నలిస్టుల పోరాటానికి ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
మా ఇల్లు మాకు కావాలని చేస్తున్న నిరసన పోరాటాలకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పూర్తి మద్దతు ఉంటుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతిని ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం 70 ఇండ్లకు పైగా నివేష స్థలాలు ఇవ్వగా జర్నలిస్టు లక్షల రూపాయలు వెచ్చించి అప్పులు చేసి ఇల్లులు కట్టుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థలాలు జర్నలిస్టులకు ఇస్తుందని సమస్యలు పరిష్కరిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం అని అన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు విషయంలో మనోవేదన చెంది ఇద్దరు జర్నలిస్టులు గుండెపోటుతో మరణించారని అన్నారు. నాలుగు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల సమస్యను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులను కలుపుకొని మరిన్ని పోరాటాలు చేపడతామని వెంకటేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, కోశాధికారి లద్దునూరి విష్ణు, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.





