- అన్నిరకాల ఏర్పాట్లు సిద్ధం చేసిన ఆలయ అధికారులు
- ఏడు వాహనాలపై ఊరేగనున్న శ్రీనివాసుడు
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. మంగళ వారం ఉదయం 6గంటల నుంచి సప్త వాహనాలు (ఏడు వాహనాలు)పై భక్తులను కటాక్షిస్తారు. ముందుగా స్వామి, అమ్మవార్లు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత వరుసగా చిన్నశేషవాహనం, గరుడవాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తలను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాల తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగిన వాహనాలు అన్నీ ఒకే రోజు భక్తులకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు రథసప్తమి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినాన శ్రీనివాసుని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తిరమల తరహాలో వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే రథసప్తమి ఉత్సవాలను తిలకించేందుకు తరలి వచ్చే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రధాన ఆలయంతో పాటు వాహన మండపం స్వామి, అమ్మవార్లు ఊరేగే సప్త వాహనాలను పరిమళభరిత పుష్పాలు, పత్రాలతో ఎంతో అందంగా అలంకరణ చేశారు.





