- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్



నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించి ప్రోత్సహిస్తుందని, ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలో గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమీపంలో మందమర్రి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందని, స్వయం సహాయక సంఘాల మహిళలు వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో క్యాంటీన్లు, మీ-సేవ, పెరటి కోళ్ళు, కోళ్ళ పారం, పాల డైరీ, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర వివిధ నిర్ధిష్ట అంశాలను పొందుపర్చడం జరిగిందని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, క్యాంటీన్లలో నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి అవకాశాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు తమ కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం తహశిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. వివిధ రకాల ధృవపత్రాల కొరకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ధృవపత్రాలు జారీ చేయాలని, వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశిల్దార్ సతీష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, సంబంధిత అధికారులు, సమాఖ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.





