నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 9 నుండి 15 వరకు జరుగుతాయని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ శుబుదేంద్ర తీర్థుల ఆదేశాలతో విచారణ కర్త ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 9న పుణ్యావాచనం, అంకురార్పణ, దేవత ఆహ్వానం, ధ్వజారోహణం జరుగుతాయని ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, శాశ్వత సభ్యులైన డీకే సమరసింహారెడ్డి పాల్గొంటారని తెలిపారు. 10 తారీఖున శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం ఉత్సవం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల జ్యోతి హాజరుకానున్నట్లు తెలిపారు. 11న గరుడ వాహనంపై లింగం భావి నందు తెప్పోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 12న పౌర్ణమి రోజు విశేష ఫల పంచామృతాభిషేకం, రథాంగ హోమం, హోమం పులిహోర కోట నిర్మించి శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి మహారథోత్సవం రాత్రి పది గంటలకు జరుగుతాయని తెలిపారు. 13, 14 ,15 తేదీలలో ప్రత్యేక పూజలు, అవబృత స్నానం, శ్రీ సత్యనారాయణ వ్రతం, దేవత విసర్జన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మృత్తిక బృందావన ప్రతిష్ట జరిగి 14వ తేదీ నాటికి 16 సంవత్సరములు పూర్తవుతున్నందున శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం గద్వాల శాఖ యందు ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. ఇట్టి బ్రహ్మోత్సవాలకు భక్తాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.





