- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– పిల్లలకు మంచి భవిష్యత్తు అందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ మోడల్ పాఠశాల స్థాపించి 30 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య ప్రతినిధి సిరిపురం సత్యనారాయణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ,

విద్యార్థుల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమైనదని, తల్లిదండ్రులు పిల్లల దైనందిన ప్రవర్తనను గమనిస్తూ, వారి క్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు కొరకు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రపంచంలోనే మన దేశంలో పిల్లల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు బాల్యం నుండి చదువుతో పాటు సామాజిక బాధ్యత, ఆటలు, కళలు ఇతర రంగాలలో వారికి గల ఆసక్తిని గుర్తించి, ఆయా రంగాలలో వారు రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. పిల్లలకు టీం వర్క్ వల్ల కలిగే ఉపయోగాలను వివరించాలని, కలిసి పని చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదని తెలియజేయాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని పట్టుదల, ఏకాగ్రత, ఇష్టంతో కృషి చేసి సాధించాలని, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను తెలివితో ఎదుర్కోవాలని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో విద్య అభ్యసించిన ఎంతో మంది ఎన్నో రంగాలలో రాణిస్తూ ఉన్నత స్థానాలలో నిలిచారని, వారి స్ఫూర్తితో విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.





