నేటి సాక్షి తిరుపతి ప్రతినిధి (డాక్టర్ శివ):
తిరుపతి పార్లమెంటు పరిధి సత్యవేడు నియోజకవర్గం, నాగలాపురం మండలం, నాగలాపురం గ్రామంలో జాతీయ రహదారి 71A నుండి పాత పుత్తూరు సత్యవేడు రోడ్డు వరకు ఉన్న మార్కెట్ కమిటీ రోడ్డు గుంతలు పడి, వాహన చోదకులు సుదీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. నాగలాపురం గ్రామంలోని గుంతలు పడి ఉన్న రోడ్డు పూర్తిగా మారింది, దీంతో గ్రామంలోని రోడ్లు మరింత పటిష్టంగా, సుందరంగా మారాయి . వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గ్రామ ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. నాగలాపురం నుంచి పిచ్చాటూరు మండలం, ఓబులురాజు ఖండ్రిగ, కారూరు, అడవి కోయంబేడు, చెంచురాజు ఖండ్రిగ, పులిపాడు గ్రామాలకు ఈ మార్గం ద్వారానే ప్రయాణించాలని స్థానికులు తెలిపారు. సమస్య గురించి తెలుసుకొన్న వెంటనే స్పందించి గ్రామంలో రోడ్డు నిర్మాణానికి చొరవ తెసుకొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారికి గ్రామస్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు . తన విజయంలో కీలక పాత్ర పోషించి అత్యధిక మెజారిటీ అందించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ ఋణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. సత్యవేడు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తనపై చూపిన ప్రేమ, ఆదరణకు తాను ముగ్ధుడినయ్యానని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరమైన కేంద్ర నిధులు తెచ్చేందుకు నిరంతరం పాటుపడతానని స్పష్టం చేశారు.





