- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )

వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్డులో గల మహదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల మహాసభలో తెలంగాణ మీడియా అకాడమి తొలి చైర్మన్, టియుడబ్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంబంగా పాత్ర వహిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే కీలక బాధ్యతను నిర్వహిస్తోందని అన్నారు. నేటి డిజిటల్ యుగంలో మీడియా పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది అని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రత్యక్షంగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, పాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడంలో మీడియా పాత్ర అమూల్యమని, జర్నలిస్టులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు జర్నలిస్టు ముసుగులో ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న పేడ్ జర్నలిస్టులను ప్రోత్సహించడం సమాజానికి హానికరమని ఆది శ్రీనివాస్ గారు తీవ్రంగా విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిర్ధిష్ట లక్ష్యంతో పేకజర్నలిజాన్ని ప్రోత్సహించడం అనైతికమని, దీన్ని ప్రజలు గమనించి నిజమైన జర్నలిజాన్ని ప్రోత్సహించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్తోందని, నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహాసభలో పాల్గొన్న జర్నలిస్టులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి, నిస్వార్థంగా పనిచేసే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






