నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టి, నియంత్రించే అవకాశం ఉందని జిల్లాలోని కన్నేపల్లి ఎస్ఐ గంగారాం తెలిపారు. ఆదివారం కన్నేపల్లి మండల పరిధిలోని టేకులపల్లి, జనకపుర్, జజ్జరవెల్లి గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం సిపి ఎం శ్రీనివాస్, ఐపీఎస్, ఐజి, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపిఎస్ ఆదేశాలతో బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్, తాండూరు సిఐ కుమారస్వామి సూచనల మేరకు మండలంలో పలు ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చునని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ పెద్దలు, దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలిస్ సిబ్బంది, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.





