- మృతదేహాన్ని చెరువుల నుండి వెలికి తీసిన పోలీసులు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రపురం ప్రమాదవశాత్తు రాయల చెరువులో పడి రాయలచెరువు పేట గ్రామానికి చెందిన పెనుగొండ లోకేష్(23) మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సమాచారం మేరకు పెనుగొండ లోకేష్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో రామచంద్రాపురం నుండి ఏపీ 39 8537 నెంబర్ గల బజాజ్ ప్లాటినా మోటార్ సైకిల్ వాహనంలో స్వగ్రామమైన రాయలచెరువు పేటకు వెళుతుండగా రాయలచెరువు కట్ట సమీపమున ఉన్న మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున పక్కనే ఉన్న రాయలచెరువు నీటిలో వాహనంతో పాటు పడిపోయి మృతి చెందాడు . తన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని తండ్రి పెనుగొండ వెంకటరమణ, కుటుంబ సభ్యులు లోకేష్ ఫోన్ కు చేశారు. లోకేష్ ఫోన్ పనిచేయకపోవడంతో రాత్రంతా వెతికారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామచంద్రపురం ఎస్ఐ రామాంజనేయులు లోకేష్ ఫోన్ నెంబర్ తో లొకేషన్ ట్రాకింగ్ తీయడంతో ఆదివారం ఉదయం 11 గంటలకు రాయలచెరువులో లోకేష్ మృద్దేహం, ద్విచక్ర వాహనం ఉన్నట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం రాయలచెరువు గ్రామానికి చెందిన యువకులు, కుటుంబ సభ్యుల ద్వారా పెనుగొండ లోకేష్ మృతదేహాన్ని చెరువుల నుండి వెలికి తీసి… మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రమాదంతో పెనుగొండ లోకేష్ చెరువులో పడి మృతి చెందిన విషయం గ్రామ ప్రజలకు తెలియగానే రాయల చెరువు పేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, తన్నీరు మున్నీరై శోకసముద్రంలో మునిగి తేలారు. ఆర్ సి పురం ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





