- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఎ పురుషోత్తం నాయక్ తో కలిసి బిసి సంక్షేమ వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, 10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పాఠ్యాంశాల సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నూతన మెను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు గల ఆహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, ఎఓ తిరుమల, సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.





