- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, జవాబుదారీగా పనిచేస్తున్న
- కేంద్ర మంత్రులను కలిసి విన్నపాలు చేస్తున్నా
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చిత్తూరు ( ఢిల్లీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఏ.పి అభివృద్ధి, చిత్తూరు పార్లమెంటు ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నా అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, జవాబుదారీగా పనిచేస్తున్నానన్నారు. ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆయన, ఓవైపు తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మరో వైపు రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలను సాధించడం పై దృష్టి సారించారు. విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ఇదే అంశాలకు సంబంధించి, తన వాణిని పార్లమెంటులో కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
మంగళవారం ఢిల్లీలో తన కర్తవ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పై గురుతర బాధ్యతను పెట్టారని తెలిపారు. అందుకు అనుగుణంగా కూటమి ఎంపీలమైన తామంతా ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కూడా తనకు ముఖ్యమని చెప్పిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..,మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారుల సమన్వయంతో పార్లమెంటు ప్రగతికి పాటు పడుతున్నట్లు ఆయన తెలియజేశారు. వారు అందిస్తున్న తోడ్పాటు తనకు నూతనోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఏపి అభ్యున్నతికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్నీ, పార్లమెంటు సమావేశాల సందర్భంగా 2025-26 ఆర్థిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనానికి చేసిన కెటాయింపులే దీనికి నిదర్శనం అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.





