- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) తిరుపతి : తిరుపతిని టూరిజం హబ్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి – ప్రయాగ్ రాజ్ ప్యాకేజి టూర్ బస్సును మంగళవారం ఉదయం అలిపిరి గరుడా సర్కిల్ వద్ద జెండా ఊపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మహాకుంభమేళలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా మంగళవారం, బుధవారంతో పాటు ఈనెల 18వ తేదీ పర్యాటక శాఖ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళను ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు. మహాకుంభమేళలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వామని ఆయన తెలిపారు. ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు విమాన, రైలు సౌకర్యం ఉన్న భక్తులకు అందుబాటు ధరల్లో టూరిజం శాఖ బస్సు ప్యాకేజీలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తిరుపతిని టూరిజం హబ్ గా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మహాకుంభ మేళలో 45కోట్ల మంది భక్తులు ఇప్పటి వరకు పుణ్యస్నానాలు ఆచరించారని టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. సామాన్య భక్తులకు మహాకుంభమేళలో పాల్గొనే అవకాశం తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజిగా టూరిజం శాఖ కల్పించడం అభినందనీయమని ఆయన చెప్పారు. టిటిడి సైతం మహాకుంభమేళలో భాగస్వామ్యమై సేవలందిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరక్టర్ రమణ ప్రసాద్, డివిఎం శ్రీనివాసులు జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, యువరాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగార్జున రావు, ఆముదాల వెంకటేశ్, మునస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు.





