Thursday, March 19, 2026

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం

  • సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందామని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ఎన్జీఓ హోంలో సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ అన్నమయ్య జిల్లా విస్తృత సాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగార్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న కుంభమేళాలో అనేకమంది మరణిస్తే దానికి బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పేరుతో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు తన పదవిని రక్షించుకోవడం కోసం బిజెపికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో హిందూ మతాన్ని రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పథకాలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ ఉధృతమైన ఉద్యమాన్ని నిర్మిస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.అనంతరం 11 మందితో అన్నమయ్య జిల్లా నూతన కమిటిని ఎన్నుకున్నారు. సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ అన్నమయ్య ‌జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ మావులూరి ‌విశ్వనాథ్, కమిటీ సభ్యులుగా సిగి చెన్నయ్య, పి. రమణ, ఎం. సుజాత, ఎం. రఘునాథ్ నాయుడు, నీలావతి జయసింహ, సి. ఆంజనేయులు, తుమ్మల లవకుమార్, సుబ్బయ్య, వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణయ్య ఓబయ్య, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నాయకురాలు సుబ్బమ్మ, రాయచోటి, కోడూరు, పీలేరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News