నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఇంటర్నెట్ ను జాగ్రత్తగా, భాద్యతా యుతంగా మరియు భద్రంగా ఉపయోగించు కోవడం ద్వారా సైబర్ ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని జిల్లా సమాచార అధికారి (డి.ఐ.ఓ) సుధీర్, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్లు పేర్కొన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (ఐడిఓసి) వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి) వారి ఆధ్వర్యంలో సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం (సేఫర్ ఇంటర్నెట్ డే) సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బందికి సురక్షితమైన ఇంటర్ నెట్ వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలకు సంబంధించిన ఇంటర్ నెట్ సేవలపై సందేహములను నివృత్తి చేశారు. సైబర్ భద్రత పై అవగాహన, బలమైన పాస్వర్డ్ వినియోగం, ద్విపాత్రిక ధృవీకరణ (2ఎఫ్.ఏ) సురక్షిత వెబ్ బ్రౌజింగ్, మరియు సైబర్ నేరాల నివేదిక విధానాల గురించి, ఇంటర్నెట్ను సురక్షితంగా ఉపయోగించుకునే మార్గాలు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమాజంలో సైబర్ మోసాలు, హ్యాకింగ్, ఫిషింగ్, తదితర అంశాలపై (డి.ఐ.ఓ) సుధీర్ వివరించారు. అదేవిధంగా మాల్వేర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సురక్షిత డిజిటల్ ప్రవర్తన అలవర్చు కోవడం అత్యవసరమని నిపుణులు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి గౌరీశంకర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ అనంత రామకృష్ణ, ఈడిస్ట్రీక్ -జిల్లా మేనేజర్ (ఈడిఎమ్) శ్రీదర్, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





