- ఏర్పాట్లను పరిశీలించిన టిటిడి జేఈవో
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : శ్రీకపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి 28 వరకు జరుగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిబ్రవరి 19 – 28 వరకు శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుగనున్న సందర్భంగా ఆలయంలో పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని, ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోళీలు, స్వామివారి వాహనాల మరమ్మత్తులు, పెయింటింగ్, విద్యుత్ కాంతులు, ఫ్లెక్సీలు, పటిష్టంగా క్యూలైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ పనులు ఉంటే తక్షణలు అనుమతులు తీసుకుని భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఫుష్కరిణి క్లీనింగ్ ను, క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అర్చకులు, డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ కె. సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్, డిఈ శ్రీ మల్లయ్య, సీనియర్ అసిస్టెంట్ శ్రీ దాము, టెంపుల్ ఇస్పెక్టర్ ఎ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.





