- బిఎస్పీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
నేటి సాక్షి, మందమర్రి:- పట్టణ మున్సిపల్ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో రోడ్లు, కాలువలను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, పట్టణ మార్కెట్ ప్రాంతంలో బఢా వ్యాపారస్తులు రోడ్లు, కాలువలను, ఖాళీ స్థలాలను ఆక్రమిస్తూ, బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని, మున్సిపల్ చట్టాలంటే వీరికి లెక్క లేదని ధ్వజమెత్తారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలోని రామకృష్ణ మెడికల్ షాప్ నుండి అజయ్ క్లాస్ స్టోర్ క్రింది వరకు గల పాత కాలువపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి, కాలువను పునర్నిర్మాణం చెయ్యాలని, అన్ని దుకాణాల ముందు గల కాలువను ఆక్రమించడం వల్ల వర్షపు నీరు పోకుండా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని కోరారు. ఎస్బిఐ ముందు గల కాళీ స్థలంలో ప్రజల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని నిర్మించాలన్నారు. కూరగాయల మార్కెట్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి ముందుకు జరిపి నిర్మాణాలు చేసినందు వల్ల రద్దీ ఏర్పడి, వినియోగదారులకు ఇబ్బంది కలుగుతున్నందున రోడ్డును వెడల్పు చేసి, రద్దీని నివారించాలని, గంప శంకరయ్య జి మార్ట్, రాజయోగి షాపింగ్ మాల్ ప్రక్కన ప్రజల సౌకర్యార్థం విశాలమైన రోడ్లు ఉండేవని, వాటిని ఆక్రమించి, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేశారని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు గాజుల శంకర్, ఎండి మతిన్ ఖాన్, బోర్లకుంట రాయలింగు లు పాల్గొన్నారు.





