- పదకొండు లక్షల విలువ గల పది తులాల బంగారం, పన్నెండు తులాల వెండి స్వాధీనం
- ఒక ద్విచక్రవాహనం
- నిందితునిపై పదుల సంఖ్యలో కేసులు
- పోలీస్ ల నుండి తప్పించుకోవడంలోను దిట్ట
- అనూహ్యంగా చిక్కిన దొంగ
నేటి సాక్షి, మెట్ పల్లి, (గోరుమంతుల నరేందర్) : మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో మరియు ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా అంతర్ జిల్లా దొంగను చాకచక్యంగా పట్టుకున్నట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.బుధవారం స్థానిక సిఐ కార్యాలయంలో మల్లాపూర్ ఎస్సై రాజుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితుడు మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ పుండలిక్ విజయ్(28) బైంసా పట్టణం నిర్మల్ జిల్లా. లక్ష్మణ్ చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి రాజీవ్ నగర్, బైంసాలో ఉండేవాడు. అతనికి నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు ఉన్నారు. క్లీనర్ గా పనిచేశాడు. లక్ష్మణ్ హైదరాబాద్ వచ్చి అక్కడక్కడ పనులు చేస్తూ మద్యం, పేకాటకు బానిసయ్యాడు. పనితో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. లక్ష్మణ్ ఒంటరిగా బస్సుల్లో వివిధ గ్రామాలకు వెళ్లి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలు పగలగొట్టి బీరువాలు తెరిచి, బంగారు వెండి ఆభరణాలు డబ్బులు దొంగిలించేవాడు. రోడ్లపై నిలిపి ఉంచిన తాళం లేని మోటార్ ద్విచక్ర వాహనాలను కూడా దొంగిలించేవాడు.వాటిని ఉపయోగించి మరికొన్ని దొంగతనాలు చేసి ఆ వాహనాలను వదిలి వేసేవాడు. దొంగిలించిన సొమ్ముతో లాడ్జిల్లో ఉంటూ జల్సాలు చేసేవాడు.లక్ష్మణ్ ఇప్పటివరకు నలభై దొంగతనాలు చేయగా,ఇరవై ఎనిమిది కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.వాటిలో పన్నెండు కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించింది. లక్ష్మణ్ గతంలో మూడుసార్లు మహబూబ్ నగర్, జగిత్యాల, కరీంనగర్ పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయాడు. చివరగా ఆగస్టు 2024లో నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో ఒక దొంగతనం, అక్టోబర్ 2024లో కమ్మర్ పల్లి మండలంలో ఒక దొంగతనం చేసి, పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళాడు. డిసెంబర్ 2024లో బెయిల్ పై బయటకు వచ్చి మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో ఒక దొంగతనం, ముత్యంపేట గ్రామంలో మరొక దొంగతనం, మెట్ పల్లి పట్టణంలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అలాగే మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో మరొక దొంగతనం చేయడం జరిగింది.మంగళవారం మధ్యాహ్నం సమయంలో మల్లాపూర్ ఎస్సై రాజు తన సిబ్బందితో కలిసి ముత్యంపేట గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, మోటార్ సైకిల్ పై వస్తున్న నిందితుడిని అనుమానాస్పద స్థితిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుండి నూట మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ రూ.పదకొండు లక్షల రూపాయలు అన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించి ఈ అంతర్ జిల్లా గజదొంగను చాకచక్యంగా పట్టుకున్న మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై రాజు మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్ పల్లి డిఎస్పి రాములు ప్రత్యేకంగా అభినందించారు.





