- తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
నేటి సాక్షి, తిరుపతి న్యూస్ తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై అవిశ్రాంత పోరాటాలకు శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వానికి నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతామని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎంపీ మాట్లాడారు. వైసీపీ ఉద్యమాలకు భూమన కరుణాకరరెడ్డి రాజకీయ అనుభవం ఎంతో దోహదం చేస్తుందన్నారు. తిరుపతిలో ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని అమానవీయ ఘటనల్ని చూశామన్నారు. రౌడీలతో పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. తిరుపతి దుర్ఘటనపై హైకోర్టు మొదలుకుని సుప్రీంకోర్టు వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా నడుచుకున్న ఏ ఒక్కర్నీ విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు. ఎవరైతే తనతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులపై దాడికి పాల్పడ్డారో, వాళ్లందరినీ కటకటాలపాలు చేసే వరకూ పోరాటం సాగుతుందన్నారు. తన సోదరుడు భూమన అభినయ్తో కలిసి న్యాయపోరాటం చేస్తామన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థల దృష్టికి తిరుపతిలో జరిగిన దుర్ఘటనలను తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాలల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
అసాంఘిక శక్తుల అరాచకాల వల్ల తిరుపతి నగర పవిత్రతకు, ప్రశాంతతకు భంగం కలుగుతోందని వాయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోడానికి బస్సులో వెళుతున్న తమపై కూటమి గూండాలు, అలాగే పోలీసులు కలిసి దాడి చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. అప్రజాస్వామిక విధానాలపై భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో సాగిస్తున్న పోరాటం విజయం సాధిస్తామనే నమ్మకం వుందన్నారు. ఇవాళ ఎవరైతే బాధ్యతలు తీసుకుంటున్నారో, వాళ్లంతా బాధ్యతాయుతంగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తారనే ఆశాభావాన్ని గురుమూర్తి వ్యక్తం చేశారు.





