- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ఆర్థిక కార్యకలాపాలను ప్రణాళికబద్దంగా చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, ఎస్సి కార్పొరేషన్ ఈడి దుర్గాప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ పురుషోత్తం లతో కలిసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థిక కార్యకలాపాలను ప్రణాళికబద్ధంగా చేయాలని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, తెలివిగా నడుచుకోవాలని, బాధ్యతాయుతంగా అప్పు చేయాలని, సమయానికి తిరిగి చెల్లించి మంచి క్రెడిట్ స్కోర్ కొనసాగించాలని తెలిపారు. వచ్చే ఆదాయంలో నెలసరి బడ్జెట్ ను ప్లాన్ చేసుకొని పొదుపు చేయాలని, తమ ముఖ్య అవసరాలను సరిగ్గా గుర్తించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని, పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి ఖర్చు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





