నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఎన్ రమేష్ : మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసి, భూమారెడ్డి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని, ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు మరియు నిరుద్యోగుల పట్ల వారి నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ నుండి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన నిధులు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు, కేటాయింపులు రాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, పలు నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యాగాలు భర్తీ చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “అల్ఫోర్స్” వూట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు లక్ష్మీ కాంతారావు, నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, మరియు ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పట్టభద్రులు పాల్గొన్నారు.




