నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : మార్చి 14వ తేదిన తిరుమలలో జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమారధార తీర్థ ముక్కోటికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 14వ తేది ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే భక్తులను కుమారధార తీర్థానికి అనుమతిస్తామన్నారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతించమని తెలిపారు. పాపవినాశనం నుండి కుమారధార తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచాలని, అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుండి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీవోలు రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.




