- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో రంజాన్ పండుగను ప్రజలు శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, మంచిర్యాల, జైపూర్ ఎసిపి లు ప్రకాష్, వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు లతో కలిసి మండలాల తహశిల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, ముస్లిం మత పెద్దలతో రంజాన్ పండుగ వేడుక నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పండుగలను ప్రజలంతా సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. రంజాన్ మాసం, ఈద్-ఉల్-ఫితర్ పండుగ నిర్వహణ కొరకు సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, రేషన్ ఇతర సౌకర్యాలపై శ్రద్ధ వహించాలని, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్, త్రాగునీటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రార్థన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా జరుగాలని, రంజాన్ మాసంలో ఏ ప్రాంతాలోనూ అనవసరమైన లోడ్ షెడ్డింగ్ ను అనుమతించకూడదని, ఇఫ్తార్, సెహ్రీ సమయాలలో నిరంతయారంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మసీదులు, ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలలో శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై సరైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అధికారులు సంబంధిత అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, మార్కెట్, మసీదుల సమీపంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలందరు పండుగలను సామరస్యంతో శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




