- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- శాసనసభ్యుడిగా, ప్రజల ప్రతినిధిగా ప్రజా శ్రేయస్సు కోసం విశిష్ట సేవలు అందించిన దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేసి విశిష్ట సేవలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి శ్రీపాదరావు అని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీపాదరావు మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా, శాసనసభ స్పీకర్ గా వివిధ పదవులలో పని చేశారని తెలిపారు. వినూత్న సంస్కరణలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రభుత్వం శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్సి కార్పొరేషన్ ఈడి దుర్గాప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




