- మంచి చదువుతోనే పేదరికం పోతుంది
- గొప్ప ఆలోచనలే గొప్ప వ్యక్తులను తయారు చేస్తాయి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): నైపుణ్య శిక్షణలో లీడ్ ఇండియా అధినేత సూచనలు.మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కన్న కలలను నిజం చేయాలంటే నేటి విద్యార్థులు భవిష్యత్ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులుగా మారాలని మాజీ ఎమ్మెల్యే, లీడ్ ఇండియా అధినేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ మండలం యల్లాయిగూడలోని విజయలక్ష్మీ మెమోరియల్ స్టోన్ బ్రిడ్జి స్కూల్ లో జరిగిన నైపుణ్య శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. విద్యార్థులకు పలు సూచనలు చేశారు కేఎల్ఆర్. పేదరికం పోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని లక్ష్మారెడ్డి సూచించారు. గొప్ప గొప్ప చదువులు చదివి విదేశాలకు పోకుండా మన దేశానికి సేవ చేసి అగ్రదేశాల నిపుణులు సైతం భారత్ కు వచ్చి పని చేసేలా చేయాలని భవిష్యత్ తరాలకు లక్ష్మారెడ్డి సూచించారు. స్కూల్ లో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా విద్యనందించటం అభినందనీయమని యాజమాన్యాన్ని కిచ్చెన్న కొనియాడారు. విజయానికి పేదరికం అడ్డుకాదన్న కేఎల్ఆర్… మంచి ఆలోచనలు, పాజిటివ్ థృక్పథంతో ముందు వెళ్లాలని సూచించారు. ఏదైనా సాధించాలన్న తపన చిన్నతనం నుంచే ఉండాలని.. దానిపై ధ్యాస పెట్టి రోజూ మననం చేసుకోవాలని… పుస్తకాల్లో రాసుకోవాలని విద్యార్థులకు కిచ్చెన్న తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం ఉన్న నైపుణ్యాలను గుర్తించి ఆదిశగా ప్రోత్సాహించాలని కేఎల్ఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రతినిధులు, స్కూల్ యాజమాన్యం, టీచర్లు పాల్గొన్నారు. కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా లక్షల మంది విద్యార్థులకు లీడ్ ఇండియా నైపుణ్య శిక్షణ ఇవ్వటం సంతోషమని టీచర్లు అన్నారు.




