- ప్రజలతో పాటు కార్మికుల సంక్షేమం ముఖ్యం
- మనందరం ఒక కుటుంబం సమస్యలు ఉంటే నన్ను కలవండి.
- కమిషనర్ ఎన్. మౌర్య
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : స్వచ్ఛ సర్వేక్షన్ లో తిరుపతి ఉన్నత స్థానం, ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు నగర ప్రజలతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కలసి కట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో పచ్చదనం – పారిశుద్ద్యం, స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు చేయాల్సిన ప్రణాళికలపై తిరుపతి మహతి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం – పరిశుభ్రత పెంచడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ప్రజలతో మమేకమై వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను వదిలి పెట్టి పనులు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో నా కుటుంబ సభ్యులైన మీ సంక్షేమం అంతే ముఖ్యమని అన్నారు. మీ రక్షణ కోసం మేము ఆలోచించి ప్రత్యేక రక్షణ కవచాలు ఇచ్చామని వాటిని వినియోగించాలని అన్నారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేస్తున్నామని, ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ లోని ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ పై స్థాయి అధికారులతో పరిష్కారం కాని పక్షంలో నేరుగా నన్ను కలిస్తే తగు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. స్వచ్ఛ సర్వెక్షణ్ లో తిరుపతి ఉత్తమ ర్యాంకు సాధించాలంటే అందరూ కలసి కట్టుగా పని చేయాలని అన్నారు. సచివాలయ కార్యదర్శులు అందరూ ప్రతి రోజూ విధులకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించి మేమున్నాము అనో భరోసాను వారికి కలిగించాలని అన్నారు. మీ అందరికీ తోడుగా మేమున్నాం మీరు నగర శుభ్రతకు, పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి తో కృషి చేయాలని అన్నారు. తిరుపతి అంటేనే ప్రపంచంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. అటువంటి తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యతను మనకు దేవుడు ఇచ్చిన వరంగా భావించి పని చేయాలని అన్నారు. మనం అందరూ కలసి పనిచేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్ దేశంలోనే ఉత్తమ ర్యాంకు సాధించడం ఖాయమని అన్నారు. ఆదిశగా అందరూ పని చేయాలని, ముఖ్యంగా అధికారులు కింది స్థాయి సిబ్బందితో కలసి మెలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం ఉన్న ప్లాంటులో వివిధ రకాలుగా నిర్వహణ చేస్తున్నామని అన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని అందరూ సందర్శించాలని అన్నారు. తద్వారా ఇంటింటి వద్ద సేకరించి చెత్త ఎలా చేస్తున్నాం, దాని వలన కలిగే లాభాలు స్పష్టంగా తెలుస్తాయి అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, డి.ఈ.లు, ఏసిపిలు, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.



