తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్ కి మార్చి 8 వ తేదీ నుండి వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తెలిపారు. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ ని ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలించి, వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయలచెరువు రోడ్డులో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 13 అంతస్థులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. గ్రౌండ్, ఒకటవ అంతస్థుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్థులలో ఆఫీస్ ల వినియోగానికి, మిగిలిన అంతస్థుల్లో నివాస యోగ్యంగా 2,3,4 బెడ్ రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ప్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్ రూమ్స్, 152 ట్రిబుల్ బెడ్ రూమ్స్, 32 నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్స్ ఉంటాయని అన్నారు. మార్చి 8 వ తేదీ 2,3 అంతస్తులకు, 9వ తేదీ 4,5, అంతస్తులకు, 10 వ తేదీ 6, 7 అంతస్తులకు, 11 వ తేదీ 8,9 అంతస్తులకు, 12 వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుండి 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు. తుడా టవర్స్ నందు మోడల్ ఫ్లాట్, గ్యాలరీ ఏర్పాటు చేశామని చూడొచ్చని అన్నారు. ప్రైవేట్ నిర్మాణాలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్ ఇందులో వినియోగించామని అన్నారు. ఈ తుడా నగరంలో మధ్యలో ఉండడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ పరిశీలన, సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, తదితరులు ఉన్నారు.



