నేటి సాక్షి, బెజ్జంకి: ప్రముఖ విద్యావేత్త, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఎంపీపీస్ బెజ్జంకిలో సోమవారం ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రిగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. విద్య అభివృద్ధి ద్వారానే స్త్రీలు సమానత్వాన్ని సాధించగలరని పేర్కొన్నారు. కుల వివక్షను నివారించేందుకు ఆమె ఎన్నో సామాజిక సంస్కరణలు చేపట్టారని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నారోజు శంకరాచారి, ఐ. శ్రీవిద్య, విద్యార్థులు పాల్గొన్నారు.



