- శతావధాని శ్రీ ఆముదాల మురళి
- ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : సంగీత, సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి అని శత అవధాని శ్రీ ఆముదాల మురళి కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ఉదయం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 46వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆముదాల మురళి మాట్లాడుతూ.. శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని చెప్పారు. పాండురంగ మహత్యం, రంగనాథ రామాయణం మొదలగు గ్రంథాలలో ఇదివరకు ప్రచురణకర్తలు పొరపాటుగా ముద్రించిన పద్యాలను సరి చేశారని వివరించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డాక్టర్ లక్ష్మీనారాయణ “శ్రీరాళ్లపల్లి వారి విమర్శ సాహిత్యం ” అనే అంశంపై మాట్లాడుతూ, సారస్వత లోకం, నాటక లోకం అన్న గ్రంథాలలో రాళ్లపల్లి వారు అనేక వ్యాసాలను రచించినట్లు తెలిపారు అందులో నిగమ శర్మ – అక్క, రాయలనాటి రసికత, వేమన మొదలగు ఎన్నో వ్యాసాలు నీటికి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నట్లు చెప్పారు. కట్టమంచి రామలింగారెడ్డి స్నేహంతో వారు ప్రాచీన ఆధునిక, విమర్శ పదాలను మేలవించారని తెలిపారు. రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు. అనంతరం రాళ్లపల్లి వారి మనుమరాలు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాళ్లపల్లి దీప్త మాట్లాడుతూ.. రాళ్లపల్లి వారికి సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందని, ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని చెప్పారు. అప్పటి ఈవో శ్రీ పివిఆర్కె ప్రసాద్ చేతులమీదుగా టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియామకమైన రోజే శ్రీ అనంతకృష్ణ శర్మ పరమపదించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో డిపిపి ఏఈఓ రాములు, శ్రీ రాళ్లపల్లి రఘునందన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.



