- నిందితుడి అరెస్ట్, రిమాండ్ కు తరలింపు
- మందమర్రి సిఐ కే. శశిధర్ రెడ్డి
- పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్
నేటి సాక్షి, మందమర్రి:- మద్యం మత్తులో త్రాగునీరు ఇవ్వలేదనే సాకుతో కందుల కుమార్ అనే వ్యక్తి పొగిడి రాంబాయి అనే మహిళపై పాశవికంగా గొడ్డలితో దాడి చేసిన సంఘటన పట్టణంలో చేటుచేసుకుంది. మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ లు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని పాత సిఎస్పి రోడ్డులో నివాసం ఉన్న కుమార్ కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యం బారిన పడి, ఆర్కే 5 ఏరియా నస్పూర్ కాలనీలో కుటుంబంతో సహా నిర్వహిస్తుండగా, నాలుగు రోజుల క్రితం పట్టణంలోని పాత సిఎస్పి రోడ్డులోని తన తల్లి ఇంటికి వచ్చిన కుమార్ అక్కడే మద్యం సేవిస్తూ ఉండసాగాడు. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి సమీపంలోని రాంబాయి ఇంటికి వెళ్లి, త్రాగేందుకు నీరు కావాలని అడగగా, రాంబాయి కుమారుడు రవికుమార్ తాగేందుకు నీరు ఇవ్వగా, వాటిని తాగి వెళ్లిపోయాడు. మరల కొద్దిసేపటికి కుమార్ వచ్చి నీరు కావాలని అడగగా రాంబాయి నీళ్లు లేవని సమాధానం చెబుతూ, ఖాళీ బిందెను చూపించింది. కావాలని తనకు తాగేందుకు నీరు ఇవ్వడం లేదని కుమార్ బయటికి వెళ్లి, గొడ్డలి తీసుకువచ్చి, రాంబాయి పై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న రవికుమార్ బయటికి వచ్చేలోపే కుమార్ పరారయ్యాడు. సమాచారం పోలీసులకు అందించగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాంబాయిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ కు తరలించారు. ఈ మేరకు రాంబాయి కుమారుడు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తుండగా, మంగళవారం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద పారిపోవడానికి సిద్ధంగా ఉన్న కుమార్ ను అదుపులోకి తీసుకొని, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఎస్ఏ లు మజీద్ ఖాన్, మల్లేష్, కానిస్టేబుల్ రాజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



