- హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ భద్రకాళి చెరువు పూడిక తీత మట్టి తరలింపు ప్రక్రియ వేగ వంతంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు లో పూడిక తీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పరిశీలించారు. భద్రకాళి చెరువు నుండి పూడికతీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు, మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల కూపన్లను పరిశీలించారు. భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులో నుండి కట్టవరకు చేపట్టిన ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును అధికారులు వేగవంతం చేయాలన్నారు. పూడికతీత మట్టి ని బుధవారం నుండి ప్రారంభించాలన్నారు. పూడికతీత మట్టి పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్తు లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలింపు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పూడికతీత మట్టి పనులు సజావుగా సాగేటట్టు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, సాగు నీటిపారుదల శాఖ ఈఈ శంకర్, డీఈ హర్షవర్ధన్ కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్య నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



