- ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- హెచ్చరిక బోర్డు చించేస్తే ప్రభుత్వానికి అవమానం కాదా
- పూడ్చిన మట్టిని తొలగించకుంటే ఉద్యమమే
- చెరువులో నిల్చుని పోరాడుతాం
- కాని పక్షంలో జైలుకు వెళ్లేందుకైనా సద్ధమే
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరిక
- ప్రభుత్వం తక్షణమే స్పందించి చెరువు పూడికను తీసేయించాలని డిమాండ్
- ఓటేరు చెరువు ఆక్రమణను పరిశీలించిన సీపీఐ, సీపీఎం, ఆర్ పీఐ నేతలు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి రూరల్: భూ ఆక్రమణదారుల నుంచి ఓటేరు చెరువును కాపాడి తీరుతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తేల్చి చెప్పారు. చెరువు ఆక్రమణ తొలగించే వరకు పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం ఓటేరు చెరువును నారాయణ పరిశీలించారు. అక్కడ చెరువు ఆక్రమణను చూసి ఆయన మండిపడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే చెరువును పూడ్చేందుకు కబ్జాదారులు యత్నించిన వైనాన్ని ఆయనకు సీపీఐ, సీపీఎం, ఆర్ పీఐ నాయకులు వివరించారు. తొలతగా నీటిని నదిలోకి మల్లించి ప్రణాళిక బద్ధంగా జాతీయ రహదారిపై వున్న ఆక్రమణకు యత్నించిన వైనాన్ని అక్కడ పరిశీలించారు. తొలి రోజు నుంచి వామపక్ష పార్టీలు చెరువు వద్ద నిరసన తెలపగా ఆక్రమణ ఆగినట్లు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ దుర్మార్గంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడడం దారుణమన్నారు. తిరుపతిలో అనేక చెరువులు ఇప్పటికే ఆక్రమణకు గురైయ్యాయని, బ్రిటీష్ కాలం నాటి ఓటేరు చెరువును ఆక్రమించేందుకు ఒడిగట్టడం దుర్మార్గమైన చర్యగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత అంటాడు చెరువులు పూడ్చేసి కబ్జా చేస్తుంటే చూస్తూ ఉంటాడని ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల ప్రజలను చైతన్యం తీసుకొచ్చి చెరువును ఆక్రమణదారుల నుంచి విముక్తి కలగే వరకు పోరాటం కొనసాగిస్తామని నారాయణ తేల్చి చెప్పారు. చెరువు విషయంలో జైలుకు వెళ్లేందుకైనా వామపక్ష పార్టీలుగా తామంతా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులను దౌర్జన్యంగా చించివేస్తే అంతకంటే ప్రభుత్వానికి మరొక అవమానం ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఓటేరు చెరువు విషయంలో ప్రభుత్వం స్పందించాలన్నారు. ఆక్రమిత చెరువు భాగాన్ని పూడిక తీయించి చెరువును సుందరీకరణ చేపట్టి రక్షణ కవచాన్ని ఏర్పటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు,జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కే రాధాకృష్ణ, జె .విశ్వనాథ్, బి నదియా, కత్తి రవి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి కే శివారెడ్డి, ఓటేరు చెరువు పరిరక్షణ వేదిక కన్వీనర్ కే పద్మనాభ రెడ్డి, సిపిఎం నాయకులు హేమలత, జయచంద్ర, వేణు బుజ్జమ్మ, ఆర్పీఐ నాయకులు పి అంజయ్య, గొడుగు చింత గోవిందయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎన్ చంద్ర శేఖర్ రెడ్డి, ఎన్ డి రవి, ఎన్ శ్రీరాములు, వై యస్ మణి, మహేంద్రా, అల్లా భక్షు, జె నాగరాజు మంజుల,రత్నమ్, విజయ అలివేలు తదితరులు పాల్గొన్నారు.



