- అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయాలి
- జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
నేటిసాక్షి /వాజేడు : మండల కేంద్రంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, గ్రామాలలో సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
అన్నారు.బుధవారం వాజేడు మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావులతో కలిసి మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను నిజమైన అర్హులను గుర్తించి అందజేయడానికి చోరువ చూపాలని, మండల కేంద్రాలలోని ఎంపీడీవో, ఎంపీవో కీలక పాత్ర పోషించాలని అన్నారు. వేసవికాలంలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని, అవసరమైన పక్షంలో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని మంచి నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మండలంలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతుల వివరాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, నష్టపోయిన రైతులకు ఆయా విత్తన కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. నష్టపోయిన రైతుల వివరాలను మండల వ్యవసాయ కార్యాలయంలో రెవెన్యూ కార్యాలయంలో సూచిక బోర్లపై పేర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, నష్టపోయిన రైతు పేరు లేని పక్షంలో గురువారంలోగా పేరు నమోదు చేయించుకోవాలని అన్నారు. మండలంలో అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆయా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లాస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





