నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి లోకేష్, కోడలు బ్రహ్మిణి, మనవడు దేవాన్ష్ తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్దకు చేరుకోగానే టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో జె. శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, అర్చకులు కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసు నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, పనబాక లక్ష్మీ, ఎం.శాంతా రామ్, నన్నూరి.నర్సిరెడ్డి, జీ. భాను ప్రకాష్ రెడ్డి, ఎస్. నరేష్ కుమార్, పి. రామమూర్తి, సౌరభ్ హెచ్. బోరా, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.





