- దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం
- శ్రీవారి సేవ మరింత పగడ్భందీగా అమలు
- భక్తులకు నేరుగా అన్నదానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది
- ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : టిటిడిలో ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం తరహాలో శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమలలోని శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి లతో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజధానులలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని కోరారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో శ్రీనివాస కల్యాణోత్సవం ద్వారా నూతనోత్సాహం, నమ్మకం పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాజధాని పునఃనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. టిటిడిలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం, మాతృశ్రీ అన్నదానం భవనంలో భక్తులకు ఒక రోజు అన్నదానం చేసేలా ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులకు నేరుగా అన్నదానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా భావితరాలకు సంస్కారం నేర్పినట్లు అవుతుందని, సమాజ హితం కోసం పనిచేసినట్లు అవుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, ఈరోజు ఎస్వీ అన్నదానం ట్రస్ట్ కు భక్తులు రూ.2,200 కోట్లు కార్పస్ ఫండ్ ను డొనేట్ చేశారన్నారు.
ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలు జరగడానికి వీలు లేకుండా చేస్తామన్నారు. అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్, ఎమ్మార్, దేవలోక్ ప్రాజెక్టులకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ, విదేశాల్లో శ్రీవారి ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టిటిడిలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులే అయ్యుండాలని, అన్యమతస్తులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు. ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడు కొండలు శ్రీవారి సొంతమని, తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యాకలపాలు చేయడం, వ్యాపార ధోరణితో చూడడం జరగకూడదన్నారు. తిరుమలలో ఉన్న వ్యక్తులెవ్వరూ అపచారం చేయకూడదని సూచించారు.





