- – మైనార్టీ విద్యాసంస్థల విద్యార్థుల కృషి ఆమోఘం
- – ఆసిఫాబాద్కలెక్టర్వెంకటేష్ధోత్రే
- – వైద్య విద్యలో సీట్లు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సత్కారం
నేటి సాక్షి, ఆసిఫాబాద్ : జిల్లాలో మైనార్టీ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించి వైద్య విద్యలో సీట్లు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో వైద్య విద్యలో సీట్లు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి, మొక్కలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కాగజ్ నగర్ లోని బాలుర మైనార్టీ విద్యాసంస్థల్లో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన సయ్యద్అబుజర్, సయ్యద్ అంజర్ అలీ, సయ్యద్ అక్రముద్దీన్ను అభినందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి వైద్యులుగా ఆసిఫాబాద్ జిల్లాలో సేవలందించాలని కోరారు. వీరి ప్రతిభ విద్యార్థులకు ఆదర్శనీయమని, తల్లిదండ్రులు మైనార్టీ గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్, మైనార్టీ అకాడమిక్ సమన్వయకర్త రిజ్వాన్, విజిలెన్స్ అధికారి తాహెర్, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ జబ్బార్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






