నేటిసాక్షి : జగదేవపూర్ అక్టోబర్ 09
మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని గజ్వేల్ ఏసిపి నర్సిములు తెలిపారు. గురువారం జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో మహిళ హత్య కేసు వివరాలు వెల్లడించారు. జగదేవపూర్ మండలంలో గ్రామానికి చెందిన ఆలేటి యాదవ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా చిన్న కూతురు అపర్ణ, తన ఇంటి సమీపంలో ఉండే అబ్బాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లికి అపర్ణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అబ్బాస్, అపర్ణలు జనగాం, తర్వాత అక్కడి నుండి కుకునూరు పల్లిలో, కొద్ది రోజులు నివాసం ఉన్నారు. మూడు నెలల క్రితం అపర్ణ, అబ్బాస్ మధ్య గొడవలు రావడంతో అపర్ణ తన తండ్రి యాదవ రెడ్డి ఇంటికి వచ్చింది. తిరిగి అబ్బాస్ దగ్గరికి వెళ్దామని ఆలోచనతో అపర్ణ, అబ్బాస్ ను తనను తీసుకొని వెళ్ళమని కోరగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అబ్బాస్ తన కారు తీసుకొని అపర్ణ, ఇంటికి వచ్చి తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. అపర్ణ తిరిగి అబ్బాస్ తో వెళ్లిపోయిందని ఆగ్రహంతో యాదవరెడ్డి అతని భార్య నిర్మల, యాదవరెడ్డి, తమ్ముడు రాంరెడ్డి, ఒక ఇనుప రాడ్ ను తీసుకొని వారి ఇంటికి సమీపంలోనే ఉండే అబ్బాస్ ఇంటికి వెళ్లి అతని తల్లి అయినా సాహీం బేగంను ఇనుపరాడుతో తలపై బాధడంతో ఆమె తీవ్ర గాయాల పాలయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వెళ్లి ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మరణించిందని తెలిపారు. అనంతరం మృతురాలి కొడుకు అయిన అబ్బాస్ యొక్క ఫిర్యాదు మేరకు 332(a), 103(1) r/w 3(5)BNS లో కేసు నమోదు చేసిన జగదేవపూర్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారు హత్యకు ఉపయోగించిన ఇనుప రాడు, కర్ర స్వాధీనం చేసుకుని ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని ఏసీపి తెలిపారు. ఈ సమావేశంలో గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





