నేటి సాక్షి, ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని కూర్చుంటే సమస్య పరిష్కారం కాదని.. నడుం బిగిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని యువకులు నిరూపించారు. మండలం లోని కొత్తపేట గ్రామ శివారులో రాజీవ్ రహదారి (ఎస్.హెచ్-7) రోడ్డుపై గుంతలు పడి నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయిన ప్రభుత్వం అధికారులు పట్టించుకోక పోవడంతో ఆదివారం స్థానిక ‘వారియర్స్ యూత్ సభ్యులు’ స్పందించి స్వచ్ఛందంగా గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ…రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ఇదివరకు అనేక ప్రమాదాలు కండ్ల ముందే జరిగి ప్రాణాలు కోల్పోయారని, వీటిని నివారించేందుకు తమవంతుగా సామాజిక స్పృహతో వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో గుంతలు పూడ్చినట్టు పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో రోడ్డుపై గుంతలు పూడ్చామని, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. యువత స్పూర్తికి వాహనదారులు, స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పరుమల ఎల్లయ్య, దాసరి సాయి, పార్వతి వినోద్, దాసరి సతీష్, మహ్మద్ సలీం, గాజుల విగ్నేష్, గాజుల లక్ష్మణ్, నడిగొట్టు శ్రీనివాస్, పొన్నం రంజిత్ తదితరులు పాల్గొన్నారు.





