నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి అక్టోబర్ 13 :ఔషధ మొక్కల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ అన్నారు. శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ (అటానమస్) బోటనీ విభాగంలో సోమవారం ఆయన అతిథి ఉపన్యాసమిచ్చారు. “ఔషధ మొక్కలు – ఉపాధి అవకాశాలు” అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఔషధ మొక్కల ప్రాముఖ్యతను గురించి చక్కగా వివరించారు. ఈ రంగంలో విద్యార్థులు, పరిశోధకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సిఈఓ ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ – ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరావు, బోటనీ విభాగాధిపతి ఏ. సురేఖ, పూర్వ అధిపతి డాక్టర్ ఎం. నాగరాజు, ఫ్యాకల్టీలు డాక్టర్ ఎం. సుధాకర్, డాక్టర్ కె. సుజాత, ఎస్.వి ఆయుర్వేద కళాశాల సహాయ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. పవన్ కుమార్, శ్రీకాళహస్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కె. సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరంఔషధ మొక్కల పెంపకానికి అనువైన స్థలాన్ని కాలేజీ ప్రాంగణంలో సీఈఓ ఆవుల చంద్రశేఖర్ పరిశీలించారు. హెర్బల్ గార్డెన్ ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయవచ్చని సూచించారు. ప్రాంగణంలో ఇప్పటికే ఉన్న మొక్కలను గుర్తించి వాటికి సంఖ్యలు కేటాయించాలని, రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఔషద మొక్కలు, హెర్బల్ నర్సరీ ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలను పంపితే, ఆ ప్రాజెక్టుకు రూ. 6.25 లక్షల నిధులను మంజూరు చేయడానికి సీఈవో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ అతిథి ప్రసంగం ఎంతో విలువైందన్నారు. ప్రత్యేకించి బోటనీ విభాగానికి, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఔషధ మొక్కల విలువను గుర్తించేలా, ఆధునిక విజ్ఞానాన్ని ఉపాధి అవకాశాలను వివరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.




