నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, అక్టోబర్ 17: అపోలో యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ విభాగం శుక్రవారం వరల్డ్ ట్రామా డే ఘనంగా నిర్వహించింది. “ఎంపవర్, ఎడ్యుకేట్, ఎరాడికేట్ ట్రామా” అనే థీమ్లో, ట్రామా పరిస్థితుల్లో తక్షణ స్పందన, గాయాల నిర్వహణ, ప్రాణరక్షణ చర్యల ప్రాముఖ్యతపై విద్యార్థులు, నిపుణులు అవగాహన పెంపొందించారు. కార్యక్రమాన్ని వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ –”ట్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పుగా ఉంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు దీనికి కారణం. భారతదేశం రోడ్డు ప్రమాదాల మరియు మరణాల సంఖ్యలో ప్రపంచంలో ముందు స్థానంలో ఉంది. గత పది సంవత్సరాలుగా ఈ స్థితి కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాల సమయంలో శిక్షణ పొందిన అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు సమయానికి స్పందించడం వలన అనేక ప్రాణాలు రక్షించబడుతున్నాయి. సమాజంలో ట్రామా అవగాహన పెంపొందించడం, యువతలో తక్షణ స్పందన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అత్యవసరం” అని పేర్కొన్నారు.ప్రత్యేక ఆహ్వానితుడిగా చెన్నై అపోలో ఆసుపత్రుల అత్యవసర వైద్య నిపుణుడు డాక్టర్ గణేశ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాద సమయంలో తొలి స్పందన, గాయాల నిర్వహణ, ప్రాణరక్షణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు.కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిల్మ్లో రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, గాయాల నిర్వహణ, ప్రాణరక్షణ చర్యలు ఎలా అవసరమో వాస్తవ దృశ్యాలతో చూపించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్ఆర్ అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్, డీన్లు ప్రొఫెసర్ కె. భాస్కర్ రెడ్డి, డాక్టర్ రామయ్య ఇటుమల్ల, డాక్టర్ జగదీషన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సేతురామ సుబ్బయ్య, విభాగాధిపతి డాక్టర్ సుచరితా పి, కో-ఆర్డినేటర్లు అన్వేషా పాల్, సుబశ్రీ కె, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




