నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండలం సనుగులలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, బుధవారం ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 240 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు. రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని, తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు.రైతులకు వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని విప్ తెలిపారు. రైతులకు ఎల్లప్పడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.రూ. 20 లక్షల కోట్ల రుణమాఫీ…ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. నూతన రేషన్ కార్డులు జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్ గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని, రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణకు అందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని వివరించారు. రాజన్నకు విశేష పూజలు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం,డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.





