నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి (అద్దంకి)అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రైతులకు ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి వ్యవసాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. గతంలో నియోజకవర్గ పర్యటనల్లో భాగంగా కొందరు అన్నదాతలు తన దృష్టికి తీసుకు వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. యూరియా, డీపీఏ వంటి ఎరువులు అవసరమైన అందరు రైతులకూ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా అధిక ధరలకు, బ్లాక్ లో ఎరువులు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రానికి సరిపడినంత యూరియ, డీపీఏను కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని అధికారులు అన్ని చర్యలూ చేపట్టారని వివరించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపధ్యంలో అన్నదాతలు నష్ట పోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెఫెడ్ ద్వారా ఎరువుల విక్రయాలను పెంచడానికికూడా కృషి చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్, రబీ సీజన్ లలో రైతులకు మరింత ఉపయుక్తంగా ఉండేలా., కేంద్రం నుంచి మార్కెఫెడ్ కు వచ్చే ఎరువుల శాతాన్ని ప్రైవేటు దుకాణాదారుల కంటే ఎక్కువ పెంచేలా కేంద్రాన్ని కోరాతామని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకు వచ్చే పన్నుల ఆదాయాన్ని వాటి పరిధిలోని అవసరాలకు సంబంధిత పాలక వర్గాల ద్వారా వినియోగించేలా త్వరలోనే చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా అన్నదాతలకు చెందిన చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సమీక్ష సమావేశం కార్యక్రమంలో అద్దంకి జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





