నేటి సాక్షి గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్ ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (Quality Seed in Every Village-QSEV) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు అనగా 23- 10- 2025 న కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన గంటి లక్ష్మయ్య గారి యొక్క QSEV – వరి క్షేత్రం లో క్షేత్ర దినోత్సవం సందర్భంగా, JGL-24423 రకంలో విత్తనోత్పత్తి గాను వారు తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతుల కు వివరించారు. పిమ్మట వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ గారు మాట్లాడుతూ రైతు స్థాయిలో లో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల మరియు తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించారు. తరువాత మానకొండూరు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ శ్రీధర్ గారు మాట్లాడుతూ రైతులు ఈ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేసి, ఈ విత్తనాన్ని రైతులు మళ్ళీ వాడుకోవచ్చు అని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జి. ఉషారాణి మరియు ఇ. ఉమారాణి, మండల వ్యవసాయ అధికారి శ్రీమతి కిరణ్మయి గారు, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీ సాయికుమార్ మరియు ప్రశాంత్ గారు మరియు గ్రామానికి చెందిన ఇతర రైతులు పాల్గొని వారు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగిస్తామని వారి సుముఖతను తెలియజేసారు.





