నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా అధికార కూటమి పార్టీ వ్యక్తులు సెనెట్ హాల్లోకి ప్రవేశించి కార్పొరేటర్పై దాడి చేసిన ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా విస్తరించే అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టాలని కోరారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదిక అయిన కౌన్సిల్ హాల్లో పట్టపగలు గుండాయిజాన్ని ప్రోత్సాహించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఎంపీ మండిపడ్డారు.పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో భద్రత ఉండాల్సిన సమావేశ మందిరంలోనూ దాడులు జరగడం ప్రభుత్వం వైఫల్యమని స్పష్టం చేశారు. గతంలో డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో తమ కార్పొరేటర్లను అపహరించడానికి బయట దాడులకు పాల్పడితే, ఇప్పుడు ఏకంగా సెనెట్ హాలు లోపలే దాడి జరగడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం తిరుపతిలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితుల్లో మత్తులో వ్యక్తులు సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. మంచి అజెండాపై చర్చ జరుగుతున్న సమయంలో దానిని అడ్డుకునేందుకే కుట్రపూరితంగా ఈ దాడి జరిపించిందని ఆయన ఆరోపించారు.కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సాహస్తుందా అని ప్రశ్నించిన ఎంపీ, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అరాచక ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.





