నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………….జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ కు ‘ఫైనల్ ఎగ్జిట్’ (దేశం వదిలి వెళ్ళడానికి అనుమతి) లభించక సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చిక్కుకుపోయున సంఘటన జరిగింది. 12 వేల సౌదీ రియాళ్ళు (రూ.2 లక్షల 80 వేలు) దొంగతనం జరిగిందని యజమాని ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ పై ‘మత్లూబ్’ (వాంటెడ్ బై పోలీస్) కేసు నమోదైంది. బీపీ, నరాల సమస్యతో బాధపడుతున్న శ్రీనివాస్ ను సౌదీ నుంచి ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని కుమారుడు గాజుల సాయికిరణ్ మంగళవారం హైదరాబాద్ ‘సీఏం ప్రవాసీ ప్రజావాణి’ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లు ఆయనకు మార్గదర్శనం చేశారు. 2017 లో ఆజాద్ వీసాపై సౌదీ వెళ్లిన గాజుల శ్రీనివాస్ గత ఎనిమిది ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. భారత్ కు వాపస్ వెళ్ళడానికి అడ్డంకిగా ఉన్న ‘మత్లూబ్’ కేసు తొలగించేందుకు సహకరించాలని అతను రియాద్ లోని ఇండియన్ ఎంబసీకి ఇదివరకే రెండుసార్లు విజ్ఞప్తి చేశాడు. *హురూబ్’-మత్లూబ్’*సౌదీ అరేబియాలో ‘కఫీల్’ (స్పాన్సర్ / యజమాని) కి తెలుపకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో ‘హురూబ్’ (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని ‘జవజత్’ (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని ‘హురూబ్’ గా ప్రకటిస్తారు. కొందరు యజమానులు పారిపోయిన ఉద్యోగులపై దొంగతనం, ఆస్తి నష్టం లాంటి ‘మత్లూబ్’ (పోలీసు కేసు) నమోదు చేస్తుంటారు. దురుద్దేశం కలిగిన కొందరు ‘కఫీల్లు’ పారిపోయిన ఉద్యోగులను పీడించడానికి ‘మత్లూబ్’ వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఉద్యోగులకు సరైన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, అధిక పనిగంటలు, యజమాని సెలవు మంజూరు చేయకపోవడం, యజమాని వేధింపులు, హింసలను, అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక పారిపోతుంటారు. ‘మత్లూబ్’ (పోలీస్ కేసు) ఉన్నవారికి ముందున్నవి రెండు మార్గాలు.. యజమాని కేసు వాపస్ తీసుకోవడం లేదా పోలీసుల ముందు లొంగిపోయి న్యాయ పోరాటం చేయడం. రియాద్ లోని ఇండియన్ ఎంబసీ, జిద్దా లోని ఇండియన్ కాన్సులేట్ కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందిస్తుంది. అయినా కార్మికులు న్యాయ పోరాటం చేయడం అంత సులువు కాదు.





