నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి నగర అభివృద్ధి కొత్త దశలోకి అడుగిడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రణాళికతో ఈ ఆధ్యాత్మిక నగరం త్వరలో విస్తరించబోతోంది.. గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను జనసేన పార్టీ స్వాగతిస్తూందనిఅయితే ఈ విస్తరణలో కొన్ని సామాజిక, ఆర్థికంగా కీలకమైన గ్రామాలు అందులో లేనట్లు గుర్తించినట్లు చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ దేవర మనోహర్ పేర్కొన్నారు.ఈ అంశాన్ని శనివారం జిల్లాకలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్ల, పెరుమాళ్ళపల్లి గ్రామపంచాయతీలు తిరుపతి నగరానికి కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండా, జీవన విధానంలోనూ సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయని ఆయన తెలిపారు. “ఈ పంచాయతీలు తిరుపతి మున్సిపల్ పరిమితులకు అతి దగ్గరగా ఉన్నాయి. ప్రజలు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, రవాణా వంటి ప్రతీ అంశంలో తిరుపతిపైనే ఆధారపడుతున్నారు. అలాంటప్పుడు వీటిని విస్తరణలోంచి మినహాయించడం అన్యాయం” — అని దేవర మనోహర పేర్కొన్నారు. గ్రేటర్ తిరుపతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ లక్ష్యం సమగ్ర పట్టణాభివృద్ధి, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక పౌర పరిపాలన అని తెలిసిన విషయం. కానీ ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే, నగర పరిసర గ్రామాలు కూడా చేర్చబడాలి అని ఆయన పేర్కొన్నారు.పుదిపట్ల, పెరుమాళ్ళపల్లి వంటి గ్రామాలు ఇప్పటికే తిరుపతి నగర పరిధిలో కలిసిపోయినట్టే రోజువారీ జీవన స్రవంతిలో ఉన్నాయి. తిరుపతి నుంచి రోజూ వందలాది మంది విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు ఈ గ్రామాలకు వస్తున్నారు. తిరుపతి నగర విస్తరణలో ఇవి చేర్చబడితే, ప్రజా సేవల పంపిణీ మరింత సమతుల్యంగా, సమర్థంగా ఉంటుంది. విస్తరణ సమతుల్య అభివృద్ధి దిశగా సాగాలి. సామాజికంగా, ఆర్థికంగా తిరుపతితో కలిసిపోయిన గ్రామాలు వెలుపల ఉండకూడదు. పై అంశాలను ప్రస్తావిస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వాకా మురళి,నాగశేషు,మురళి,ప్రసాద్,బాల తదితరులు పాల్గొన్నారు.





